తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 23 April 2025

జాతీయ పతాకం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు  "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.  

 

అంశం : జాతీయ పతాకం


కందము:

రంగులుమూడు నడిమి గుం

డ్రంగానే ధర్మచక్ర రచనయు గలిసెన్

పింగళి వెంకయ కూర్చిన

హంగగు జెండాకు జేతు నభివందనమున్. 


కందము:

మూడగు రంగుల, త్యాగము

తోడుగ శాంతియు సహనము తో నడుమనుచున్

జాడను దెలుపు పతాకము  

వేడుకగా భారతవిను వీధిని గనుమా!  


కందము:

పువ్వుల రేకులు రువ్వుచు

దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్

చివ్వలు వలదని, నవ్వుచు

మువ్వన్నెల కేతనమ్ము ముదమున నెగిరెన్. 


కందము:

రంగులు మూడును మెరయగ

ముంగిలినేదాటు శత్రు మూకలకెపుడున్

"రంగుబడుద్ద"ని జెప్పుచు

నింగిని దాకగ పతాక నిత్యమ్మెగురున్.

No comments: